
దమ్మామ్: సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవాన్ని సౌదీ అరేబియాలోని దమ్మామ్లో ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, తెలుగువారు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉండాలనే సంకల్పంతో సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. ఈ నెల 23న ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. సౌదీ అరేబియాలో ౩౦ ఏళ్ళుగా సామాజిక సేవలందిస్తున్న జహీర్ బేగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించారు.
మహిళా బృందం ఆలపించిన తెలుగుతల్లి పాటతో వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు నాగశేఖర్ మాట్లాడుతూ.. తమ సంస్థ లక్ష్యాలు, విలువలు, అందించిన సేవలను సభ్యులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ఉద్యోగుల ద్వారా ప్రవాసాంధ్రుల బీమా శిక్షణ విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.



