
-
మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ షాక్ ఇచ్చింది.
కాగా, శుక్రవారం ఉదయం ఢిల్లీలోని మనీష్ సిసోడియా నివాసం, సహా పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(లిక్కర్ స్కామ్) కేసులో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. కాగా, సీబీఐ సోదాల సందర్భంగా కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సీబీఐకి స్వాగతం. మేము పూర్తి సహకారం అందిస్తాము.. అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది.





