
35views
భారత దేశ శాస్త్రీయ చరిత్ర మూలాలు అత్యంత పురాతనమైనవని ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ డా.కృష్ణ గోపాల్ అన్నారు. భారతీయ జ్ఞాన సంప్రదాయంలో, విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత ఎల్లప్పుడూ ఒకదానికొకటి పూరకంగానే వున్నాయని, కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ నగరం అని ప్రకటించారు.వేల సంవత్సరాల నాటి సాంస్కృతిక మరియు జ్ఞాన సంప్రదాయాలు అక్కడ శక్తివంతంగా, సజీవంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
‘విజ్ఞాన భారతి’ 7వ జాతీయ సమ్మేళనం వారణాసి కేంద్రంగా జరుగుతోంది. ఈ సందర్భంగా రెండో రోజు సదస్సులో భాగంగా కృష్ణ గోపాల్ ‘‘”భారతదేశ శాస్త్రీయ సంప్రదాయం: ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు” అనే అంశంపై ప్రసంగించారు.
భారతీయ ఆలోచనా విధానంలో విజ్ఞానశాస్త్రం కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాదని, సంగీతం, నృత్యం, వ్యాకరణం, ఆయుర్వేదం, గణితం, తత్వశాస్త్రం అన్నీ కూడా విజ్ఞానశాస్త్రం యొక్క విస్తృత భావనలో భాగమేనని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మానవాళి క్షేమం ఎల్లప్పుడూ భారతీయ జ్ఞాన సంప్రదాయం యొక్క ప్రాథమిక లక్ష్యాలుగా ఉన్నాయని ఆయన చెప్పారు.
1876లో మహేంద్ర లాల్ సిర్కార్ స్థాపించిన ‘భారతీయ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ గురించి కూడా ప్రస్తావించారు. ఆ సంస్థ తన 150వ వార్షికోత్సవానికి చేరువవుతోందని, ఇది సహనం, అంకితభావం మరియు పట్టుదలతో కూడిన ప్రయాణానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారతీయ జ్ఞానం విశ్వజనీనమైనదని, అది కేవలం భౌతిక ప్రయోజనాల కోసం ఉద్దేశించినది కాదని ఆయన తెలిపారు.
మహేంద్ర లాల్ సిర్కార్, జగదీశ్ చంద్రబోస్, సీవీ రామన్, శాంతి స్వరూప్ భట్నాగర్, విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, ఏపీజే అబ్దుల్ కలాం, జీఎన్ రామచంద్రన్, అన్నామణి, ఆత్మారామ్, ఎల్లాప్రగడ సుబ్బారావు, జానకీ అమ్మాళ్ వంటి శాస్త్రవేత్తల జీవితాలను, వారి సేవలను గుర్తుచేసుకున్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయి విజయాలను సాధించారని ఆయన అన్నారు. వారి జీవితాలు కేవలం పరిశోధన, ఆవిష్కరణలకే పరిమితం కాకుండా, దేశ నిర్మాణం, నైతిక విలువలు, సమష్టి కృషి మరియు సమాజ సేవ వంటి అంశాల స్ఫూర్తితో నిండివున్నాయన్నారు.
జ్ఞానశాస్త్రం మానవ శ్రేయస్సుకు సాధనంగా మారాలంటే, అది భారతీయ జ్ఞాన సంప్రదాయాలు, నైతిక విలువలు మరియు ప్రజాసేవా స్ఫూర్తితో అనుసంధానం కావాలని సూచించారు. “విజ్ఞానశాస్త్రం మనకు ఉన్నతిని, ఆధ్యాత్మికత మనకు లోతును ప్రసాదిస్తాయి” అనే భావనను ప్రస్తావిస్తూ, భారతదేశపు శాస్త్రీయ వారసత్వాన్ని అధ్యయనం చేసి, దానిని భావి తరాలకు అందించాలని ఆయన విద్యార్థులకు మరియు పరిశోధకులకు పిలుపునిచ్చారు.





