
న్యూఢిల్లీ: గతంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే కేవలం ముస్లింల మంత్రిత్వ శాఖగా ఉండేదన్నారు. ప్రస్తుతం ముస్లింలతోపాటు క్రైస్తవులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, సిక్కులను కూడా కలుపుకొని పోతున్నట్టు బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వి తెలిపారు. తన మంత్రిత్వ శాఖ చాలా హుందాగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో మాదిరిగా బుజ్జగింపులకు పాల్పడటం లేదన్నారు. మోదీ ప్రభుత్వం ఎవరిపైన అయినా వివక్ష చూపించినట్టు ఎవరూ ఆరోపించలేరని చెప్పారు.
ముస్లింల అభివృద్ధి మాత్రమే కాదు… దేశ జనాభాలో ముస్లింలు 16 శాతం మంది ఉన్నారని, మోదీ మంత్రివర్గం నుంచి నఖ్వీ నిష్క్రమణ తర్వాత, ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని కొందరు ఆరోపిస్తుండటంపై ఆయన స్పందిస్తూ, తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు, కేవలం ముస్లింలను మాత్రమే అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేయలేదన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అందరు మంత్రులు రాజ్యాంగబద్ధంగా ప్రతిజ్ఞ చేశారని చెప్పారు.





