
భాగ్యనగరం: ఇక్కడి భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమ్మవారి పూజలో పాల్గొంటారు. ఇందుకనుగుణంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో జూలై 2,3 తేదిల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభకు కమలదళం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలకు, సమావేశాలు జరిగే హెచ్ఐసీసీ, నోవాటెల్కు వెళ్ళీ పరిశీలించారు. కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే వారిలో 40 మందికి పైగా నాయకులు బుధవారమే హైదరాబాద్కు చేరుకుని, తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళ్ళారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా రేపు హైదరాబాద్కు చేరుకుంటారు.





