
తిరుపతి: లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో నేటి నుండి టీటీడీ నిర్వహించనున్న అరణ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమానికి నిన్న రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థన మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా సంకల్పం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విక్వరణం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ఠ, అంకురార్ఫణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని మాట్లాడుతూ శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యవాసం చేస్తూ రాక్షసులను సంహారించి, తపస్సు చేసుకునే ఋషులకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. అరణ్యకాండలోని 75 సర్గల్లో 2,454 శ్లోకాలు ఉన్నాయన్నారు. ఈ శ్లోకపారాయణ ద్వారా రాక్షస గుణాలు తొలగిపోయి సాత్విక గుణాలు అలవడతాయని చెప్పారు. ” రామస్యపాదౌజగ్రాహలక్ష్మణస్యచధీమతః ” అనే మంత్రంలోని అక్షర క్రమం ప్రకారం ఆయా సర్గల్లోని శ్లోక పారాయణం జరుగుతుందని తెలిపారు.





