News

చర్చిలో తొక్కిసలాట – 31 మంది బలి

501views

* మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే

నైజీరియాలోని పోర్ట్ హార్ కోర్ట్ నగరంలో ఘోర దుర్ఘటన జరిగింది. ఒక చర్చి వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున చర్చి వద్ద ఆహార పదార్థాలు, కానుకలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు దూసుకొచ్చేసరికి తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

కింగ్స్ అసెంబ్లీ చర్చి స్థానిక పోలో క్లబ్ లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించిందని నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె తెలిపారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. “భారీగా జనం వచ్చారు. బహుమతులు పంచుతుండగా ఎగబడ్డారు. ఇదే తొక్కిసలాటకు దారి తీసింది” అని వివరించారు. తొక్కిసలాట జరిగేటప్పటికి గిఫ్టుల పంపిణీ ప్రారంభం కాలేదని పోలీసులు తెలిపారు. గేటు మూసి ఉన్నప్పటికీ జనాలు దూసుకొచ్చారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.