
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారు.
తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం ప్రయాణించేందుకు మూడు గం.ల సమయం పట్టిందని చెప్పారు. ‘ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండొచ్చు.. ఒక్కోసారి గోతులు ఎక్కువగా ఉండొచ్చు.. మేం జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడికి దాకా రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా జ్ఞాపకం ఉండేలా ఉంది’ అని అనడంతో అందరూ నవ్వేశారు.
ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని.. ప్రయాణంలో ఇటువంటి ఇబ్బంది ఏర్పడడానికి బహుశా రోడ్ల మీద గోతులు ఎక్కువ ఉండవచ్చంటూ చిన్న జీయర్ స్వామి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానంతో రాజమహేంద్రవరంలో చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ఏపి లో రోడ్ల దుస్థితి పై చిన్న జీయర్ స్వామి చేసిన కామెంట్స్ పై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.





