
తిరుపతి: తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. నాలుగు రోజులక్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. పవిత్ర అనే పేరుగల మహిళ బాలుడిని తీసుకొని మైసూరుకు వెళ్ళిందని పోలీసులు తెలిపారు.
మహిళకు మతిస్థిమితం లేదని పోలీసులు అంటున్నారు. మహిళపై మైసూరు, మండ్య జిల్లా, కేఆర్ పురంలో మిస్సింగ్ కేసు నమోదయిందని అంటున్నారు. మహిళ తల్లిదండ్రులే బాలుడిని తీసుకొచ్చి విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారని పోలీసులు తెలిపారు.
కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. సీసీ కెమెరాల ఆధారంగా విస్తృత దర్యాప్తు చేశామన్నారు పోలీసులు. గోవర్ధన్ను వెంట తీసుకున్న దృశ్యాలను సేకరించామన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయ్యాయని.. బాలుడు కిడ్నాప్ అయ్యాడన్న వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాలకూ వ్యాపించిందన్నారు.
ఇదే సమయంలో.. పవిత్ర తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై.. తిరుమలకు బాబును తీసుకురావడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. నాలుగేళ్ళ తమ బాబు.. తిరిగి క్షేమంగా తిరుమల చేరడంపై.. బాధిత కుటుంబీకులు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు.
Source: V6





