
కాంచీపురం: కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో మూడు వేల ఏళ్ళ పురాతన చరిత్ర కలిగిన ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో రామానుజాచార్యుల 1,005వ అవతార బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్యదేశాల్లో భూతపురి క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో రామానుజాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది.
చిత్తిరై నెల తిరువాదిరై నక్షత్రం రోజున 1,017వ సంవత్సరం రామానుజాచార్యుల వారు జన్మించారు. ఆలయాల నగరంగా ప్రసిద్ధిచెందిన శ్రీపెరుంబుదూర్లో ఆదికేశవ పెరుమాళ్ను పెద్దాయన అని, రామానుజర్ను చిన్నాయన అని భక్తులు పిలుచుకోవడం ఆనవాయితీ.
ఈ ఏడాది రామానుజాచార్యుల అవతార బ్రహ్మోత్సవాలు పదిరోజులుగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో జరిగే వేడుకల్లో ప్రధానాంశం ఆదికేశవ పెరుమాళ్కు పది రోజుల ఉత్సవం, రామానుజర్కు పది రోజులు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. గత నెల 16వ తేది ధ్వజారోహణంతో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదికేశవ పెరుమాళ్కు సింహ వాహనం, గరుడ సేవ, గజ వాహనం, అశ్వ వాహనం, రథోత్సవం చొప్పున పదిరోజుల ఉత్సవాలు గత నెల 25న ముగిశాయి. అనంతరం రామానుజుల వారి 1005వ అవతార బ్రహ్మోత్సవాలు 26 నుంచి ప్రారంభమయ్యాయి. 9వ రోజైన బుధవారం రామానుజుల రథోత్సవం కోలాహలంగా జరిగింది.





