News

సబర్మతి ఆశ్రమాన్ని తొలిసారి సందర్శించిన బ్రిటన్ ప్రధాని

528views

గాంధీన‌గ‌ర్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌ వచ్చారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయనకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి ఆయన బసచేసే హోటల్‌ వరకూ మొత్తం నాలుగు కిలోమీటర్ల మేర ఆయన్ను ర్యాలీగా తోడుకొని వెళ్లారు. దారి పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో శుక్రవారం దిల్లీలో సమావేశమవుతానని.. వాణిజ్యం, భద్రత సహా పలు ముఖ్యమైన విషయాలపై ఆయనతో చర్చిస్తానని జాన్సన్‌ చెప్పారు.

సబర్మతి ఆశ్రమం సందర్శన

జాన్సన్‌.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడున్న మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. బాపూజీ రచించిన ‘గైడ్‌ టు లండన్‌’, ఆయన శిష్యురాలు మీరాబెన్‌ ఆత్మకథ ‘ద స్పిరిట్స్‌ పిల్‌గ్రిమేజ్‌’ పుస్తకాలను ఆశ్రమ నిర్వాహకులు ఆయనకు అందజేశారు.

అసాధారణమైన వ్యక్తికి చెందిన ఆశ్రమానికి రావడాన్నీ.. ప్రపంచాన్ని మార్చేందుకు అహింస, సత్యాలను ఆయన మూలసూత్రాలుగా మార్చుకున్న విషయాన్ని తెలుసుకోవడాన్ని తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు జాన్సన్‌ అక్కడ రాసిన తన సందేశంలో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి