
జమ్మూ కశ్మీర్ : ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య కొనసాగుతున్న ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని అధికారులు గురువారం తెలిపారు. ఎన్కౌంటర్ మాల్వా ప్రాంతంలో చోటు చేసుకుంది. తొలుత జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆపరేషన్ కొనసాగుతూ ఉందని జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఉగ్రవాదుల ఉనికి గురించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాన్ని భద్రతా బలగాలు చుట్టేయడంతో తీవ్రవాదులు భారీగా కాల్పులు జరిపారు. భారత బలగాలు కూడా జల్లెడ పడుతూ ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుందని అధికారులు చెప్పారు.
Source: NationalistHub





