News

శివుడికే నోటీసు!

427views

రాయ్‌పూర్‌: “మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఛత్తీస్​గఢ్​ రెవెన్యూ కోడ్​-1959లోని సెక్షన్ 248 ప్రకారం ఇది నేరం. ఇలా చేసినందుకు మిమ్మల్ని ఆ భూమి నుంచి బలవంతంగా ఖాళీ చేయించవచ్చు. రూ.10వేలు జరిమానా విధించవచ్చు.”… సాక్షాత్తూ మహాశివుడికి ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నోటీసుల సారాంశం ఇది. శివుడితోపాటు దాదాపు 10 మందికి ఇదే తరహాలో తాఖీదులిచ్చారు. ఈనెల 25 జరిగే విచారణకు హాజరుకాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా పరమేశ్వరుడికే వార్నింగ్ ఇచ్చే స్థాయిలో ‘చట్టం తన పని తాను చేసుకుపోవడం’ సర్వత్రా చర్చనీయాంశమైంది.

భగవంతుడు భూకబ్జా చేశాడా?

రాయ్​గఢ్​ 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే ఇటీవల బిలాస్​పుర్​ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16మందిని నిందితులుగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, నిజానిజాలు ఏంటో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహశీల్దార్ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మూడు రోజులు విచారణ జరిపింది.

తహశీల్దార్ కార్యాలయం అధికారులు దాదాపు 10 మందికి నోటీసులు ఇచ్చారు. ఈనెల 25న జరిగే విచారణకు వచ్చి.. భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోతే.. చట్టప్రకారం చర్యలు(భూమిని ఖాళీ చేయించి, రూ.10వేలు జరిమానా) తప్పవని హెచ్చరించారు.

నోటీసులు అందుకున్న వారిలో ఆరో వ్యక్తి శివుడు! శివాలయాన్ని నిందితుడిగా పేర్కొన్నారు పిటిషనర్. ఆ ప్రకారం చూసినా.. గుడి ధర్మకర్తకో, మేనేజర్​కో, అర్చకుడికో నోటీసులు ఇవ్వకుండా నేరుగా శివుడి పేరుతోనే పంపడం చర్చనీయాంశమైంది.

అప్పుడు వారు.. ఇప్పుడు వీరు..

నేరుగా భగవంతుడికే ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో నీటి పారుదల శాఖ వారు ఇలానే చేశారు. జంజ్​గీర్​- చంపా జిల్లాలో కాలువ పక్కన ఉండే సర్వీస్​ రోడ్​ను ఆక్రమించిన కేసులో వివరణ ఇవ్వాలంటూ నేరుగా ఈశ్వరుడికే తాఖీదులు ఇచ్చారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి