
– చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి
‘మతం మారండి, పారిపొండి లేదా చచ్చిపొండి’ అంటూ నినాదాలు చేసుకుంటూ కాగడాలు పట్టుకున్న ఉన్మాద గుంపు వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ సినిమా మొదలవుతుంది. కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువుల నరమేధం పూర్తి వివరణ ఈ కాశ్మీర్ ఫైల్స్ చిత్రం. 1989-90 మధ్య కాలంలో లక్షల మంది కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు, క్రైస్తవులపై జరిగిన మతోన్మాద దాడిని ఆ ప్రాంతపు రాష్ట్ర ప్రభుత్వం ‘స్వతంత్య్ర పోరాటం’ అని పేర్కొనడం, ఒకానొక ప్రముఖ యూనివర్సిటీలో ఆ నిర్లజ్జకరమైన అబద్ధాన్ని అందంగా చూపించడానికి ప్రయత్నించడం ఇది క్లుప్తంగా ఈ చిత్ర విశేషాలు.
ముందు కళ్ళు తడుస్తాయి, తర్వాత మనసు తడుస్తుంది. ఆ తర్వాత రక్తం మరుగుతుంది. గట్టిగా ఎలుగెత్తి అరవాలి అనిపిస్తుంది. సంకెళ్ళతో కట్టేసిన సింహంలా ఆవేశం అసహనంగా మారుతుంది. వ్యవస్థపై ఏహ్యత కలుగుతుంది. అక్కడితో ఆగిపోతే బాగుండూ అనిపిస్తుంది. గ్యాస్ చాంబర్స్లో పశువులను తోలినట్టు నిర్థయగా చంపేసిన నాజీల ఘాతుకం గుర్తుకు వస్తుంది. ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తాయి. ఇలా ఎందుకు జరిగింది ? ఇన్నాళ్లు వారికి న్యాయం ఎందుకు జరగలేదు? ఇంత దారుణాలను ఎందుకు దాచి ఉంచారు? ఎవరు దాచి ఉంచారు? జాతి మొత్తం ఈ దారుణాలు ఎందుకు గమనించ లేదు? గమనించినా ఎందుకు మౌనంగా ఉంది? ప్రతి చర్చలోనూ ఇరువైపుల వాదనలు ఉంటాయి. కానీ, ఇదేంటీ ఒక వైపు వినిపించే అవకాశమే ఇన్నేళ్ళు ఎందుకు ఇవ్వలేదు? సమాధానాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. మట్టిలో మంచులో కాశ్మీర్ అణువణునా జరిగిన ఘోరాలకు సాక్ష్యాలు ఉన్నాయన్న నిజం ఈ చిత్రంలోనే తెలుస్తుంది.
తుపాకీ తూటాలకు పగిలిన పుఱ్ఱెలు సూటిగా మన అంతఃకరణను ప్రశ్నిస్తాయి. ఇక ఈ చిత్రం మనకు ఎంత స్పష్టమైన సందేశం ఇచ్చిందీ అంటే… మతోన్మాదాన్ని నిర్దాక్షిణ్యం గా అణచివేయాలని లేని పక్షంలో శాంతియుత సమాజం మనుగడ సాధించలేదని కుండ బద్ధలు కొట్టేసింది. విదేశీ మతాల ఉన్మాదం మనం గత వెయ్యి సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం.
ఈ సినిమాలో ‘పుష్కర్ కొడుకు’ తన పొరుగింటి ఘాతకుడిని నమ్మి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు, ‘సర్వానంద్ కౌల్’ అనే పేరు గల కవి ఎంత అమాయకంగా తనను ‘వారు’ ఏమీ చేయరు అని నమ్మీ దారుణంగా కాల్చి చంపబడ్డాడో…
‘శారదా’ అనే పాత్ర తన పిల్లల భవిష్యత్తు కోసం భర్తను కోల్పోయి స్వాభిమానాన్ని కోల్పోయి చివరకు దుంగలు కోసే యంత్రం మీద రెండు ముక్కలుగా ఎలా చీల్చబడిందో… 24 మంది పండిట్లు, ఒక బాలుడు ఎలా కాల్చి చంపబడ్డారో, ఆ ఘాతూకాన్ని కళ్ళప్పగించి చూసిన ఆ గ్రామ వాసులు ఎంత గొప్ప వారో తెలుస్తుంది.
ముగింపుగా ఒక్కటే మాట.. ‘శాంతియుత సమాజం కావాలంటే మనకెందుకులే అనుకొని తప్పుకుపోవడం లేదా నేనూ నా కుటుంబం బాగుందిలే… అనుకొని కళ్ళు మూసుకుని పాలు త్రాగటం కాదు. మన చూట్టూ ఉన్న సమాజాన్ని గమనించడం. ధర్మగ్లాని జరుగుతుంటే ‘నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్ధ్వంద్వంగా’ ఎదుర్కొవడమే తప్ప ఈ పోరాటంలో ఎక్కడా నీరసించకూడదు.
ఎక్కడో కాశ్మీర్లో జరిగింది… ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం జరిగింది అనుకోవాల్సిన పనిలేదు. దేశం నలుమూలలా ఎక్కడైతే ఈ ఉన్మాద మతం ఉందో అక్కడల్లా ఇప్పటికీ జరుగుతున్నాయి. కాస్త కళ్ళు తెరిచి గమనించండి. భారతీయ భవిష్యత్తు ‘సత్యం వద, ధర్మంచర’ వైపుగా వెళ్ళాలి కానీ ‘సత్యం వధ, ధర్మం చెర’ వైపు కాదు.
వ్యాసకర్త : సినీనటులు, సామాజిక కార్యకర్త
Source: VSK Telangana





