
-
ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద ఆదివాసీ జాతరగా ప్రఖ్యాతి
న్యూఢిల్లీ: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఆదివాసీల నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలతో జాతర ప్రారంభమైంది. సుమారు గంటపాటు మెస్రం వంశీయుల సమక్షంలో పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం మర్రిచెట్టు నీడన మెస్రం వంశీయులు సేదదీరారు.
ఈ సందర్భంగా భక్తులపై మెస్రం వంశస్తులు పవిత్ర జలాలను చల్లారు. అంతకుముందు నాగోబా విగ్రహాన్ని నాయక్వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి తీసుకువచ్చారు. మెస్రం వంశం ఆడపడుచులు ఆలయ ఆవరణలో మట్టితో పుట్టలు తయారు చేశారు. ఈనెల 3న మండగాజిలి పూజ, 4న ఖేతాల్ పూజ నిర్వహించనున్నారు.
పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు
కాలికి చెప్పుల్లేకుండా.. మెస్రం వంశీయులు నాగుపాముల్లా వంకలు తిరుగుతూ అడవి మార్గంలో తరలివెళ్తారు. జాతరలో భాగంగా గంగాజలం తీసుకురావడానికి ఇలా వెళ్తారు. తమతో పాటు చెట్టూ, పుట్ట, చేను పశుపక్షాదులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జాతరకు శ్రీకారం చుడతారు. ఆత్మీయంగా పలకరించుకుంటూ ఏడాది పాటు ఎదురైన కష్టాలన్నీ మరిచి అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడుపుతారు. నియమ, నిష్టలను ప్రాణప్రదంగా భావించే మెస్రం వంశీయుల నాగోబా జాతరను ఘనంగా జరుపుకొంటారు.





