
న్యూఢిల్లీ: అఫ్గాన్ ప్రభుత్వంతో సత్సంబంధాలపై పలు దేశాల ఉన్నతాధికారులతో పాక్ ఐఎస్ఐ చీఫ్ రహస్యంగా భేటీ అయినటు్ట తెలుస్తోంది. చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్ దేశాల ఇంటెలిజెన్స్ అధికారులతో పాకిస్థాన్ ఇంటెల్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) డైరెక్టర్ జనరల్ ఫయాజ్ హమీద్ ఇస్లామాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
తాలిబన్ల పిలుపు మేరకు కాబుల్ వెళ్లి వచ్చిన తర్వాత ఫయాజ్ హమీద్ ఈ భేటీ ఏర్పాటు చేయడం పలు ఊహాగానాలకు తెరలేపుతోంది. పాకిస్థాన్, చైనాతోపాటు మరికొన్ని దేశాలు తాలిబన్లకు మొదటినుంచి మద్దతిస్తున్నాయి. తాలిబన్ల పాలనకు అనుకూలంగానే మాట్లాడుతూ వస్తున్నాయి. పలు దేశాలు తాలిబన్లకు ఆయుధాలు సరఫరా చేశాయని, ఆర్థిక సాయం అందించాయని వార్తలు కూడా వచ్చాయి. అఫ్గానిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఈమధ్యే తమ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా.. పాకిస్థాన్, చైనా, రష్యా, టర్కీ, కతర్, ఇరాన్ దేశాలకు ఆహ్వానం కూడా పంపించారు. అయితే పలు కారణాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేశారు.





