
ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, హింసాత్మక ఘటనలతో కేంద్రం సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల హద్దులను ఉపగ్రహ చిత్రాల సాయంతో నిర్ణయించనుంది. ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎన్ఈఎస్ఏసీ, నెశాక్)కి అప్పగించినట్లు కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దులను శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా శాస్త్రీయంగా ఖరారు చేయాలన్న ఆలోచనను హోంమంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితం తెరపైకి తెచ్చారని ఆ అధికారులన్నారు. శాస్త్రీయంగా చేపట్టే సరిహద్దుల విభజన కచ్చితత్వంతో ఉంటుందనీ, దీని ఆధారంగా చూపే పరిష్కారం రాష్ట్రాలకు ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ అధికారులు పేర్కొన్నారు. నెశాక్ నుంచి అందే శాటిలైట్ మ్యాపింగ్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరుగుతుందనీ, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని వారు తెలిపారు.





