
ఈ నెల 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ మంత్రులు శరద్ పవార్, ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. భారత్-చైనా సరిహద్దులో తాజా పరిస్థితిని వారికి వివరించారు. వీరిద్దరూ గతంలో రక్షణ శాఖ మంత్రులుగా పని చేయడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. వీరితో పాటు సమావేశంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గత కొంత కాలంగా చైనాతో సరిహద్దు అంశంలో భారత్ వైఖరిని తప్పుపడుతూనే ఉన్నారు. భారత్ భూభాగాన్ని చైనా వశం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముందే విపక్షాల నేతలతో రాజ్నాథ్ భేటీ కావడం గమనార్హం. భారత్-చైనా సరిహద్దు అంశాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించాలని సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు సరిహద్దులో అనిశ్చితి ఇరు దేశాలకూ మంచిది కాదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు దేశాలూ ప్రాధాన్యం ఇవ్వాలని భారత్-చైనా నిర్ణయించిన తర్వాతి రోజునే ఈ భేటీ జరగడం గమనార్హం.





