
బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు వార్నింగ్ ఇచ్చారు. దేశంలో నివసించే, పనిచేసే వారు ఇక్కడి నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భాజపా ఆర్గనైజేషన్ సెక్రటరీతో ఆయన గురువారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ట్విటర్ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అలాగే కేబినెట్ మంత్రిగా తనను నియమించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
నూతన ఐటీ నిబంధనల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, ట్విటర్కు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విటర్ విఫలమైందని ఇటీవల దిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే విషయంలో ట్విటర్ వైఖరిని గత మంత్రి రవిశంకర్ ప్రసాద్ పలుమార్లు బహిరంగంగా తప్పుబట్టారు. మరోవైపు గ్రీవెన్స్ అధికారి నియామకానికి 8 వారాల గడువు ఇవ్వాలని తాజాగా దిల్లీ హైకోర్టును ట్విటర్ కోరింది.





