
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ వైద్య కళాశాల నిర్మాణానికి గతంలో నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా అనుమతులు మంజూరు చేసింది. విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు, కడప జిల్లా పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైద్య కళాశాలకు రూ.500 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్య కళాశాలకు రూ.550 కోట్లను కేటాయించింది. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కళాశాలల్లో ఒక్కో చోట 100, మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. అలాగే ఆరు చోట్ల కళాశాల రూ.104.17 కోట్లతో స్థలాల కొనుగోలుకు అనుమతులిచ్చింది. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని, పులివెందులలో స్థలాల కొనుగోలుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.





