
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ పంపారు. మే 29 నాటి హైకోర్టు తీర్పును వెంటనే ఆమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం… రమేశ్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేశ్కుమార్ ఎన్నికల కమిషనర్గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా సుప్రీంకోర్టు నిరాకరించింది.
సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం.. గవర్నర్ను కలిసి హైకోర్టు తీర్పు ప్రకారం తనను ఎస్ఈసీగా నియమించాలని కోరాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రమేశ్ కుమార్ సోమవారం గవర్నర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్ఈసీగా తనను నియమించాలని కోరారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.





