
భారత్కు చెందిన పౌరులపై నేపాల్ బోర్డర్ పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బిహార్లోని సీతామర్హి జిల్లాలోని నేపాల్ సరిహద్దుల్లో జరిగింది. నేపాల్ పోలీసులు, స్థానిక భారతీయుల మధ్య స్వల్ప వివాదం అనంతరం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో వికేష్కుమార్ రాయ్ (25) అనే యువకుడు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా సమీప పంటపొలాల్లో పనులు చేసుకుంటున్న నలుగురికి తూటాలు తగిలాయి. లగాన్ యాదవ్ అనే మరో వ్యక్తిని నేపాలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సరిహద్దులోకి ప్రవేశించిన కొందరు తమ ఆయుధాలను అపహరించారని, దీంతో తొలుత గాల్లోకి కాల్పులు జరిపామని, అనంతరం కాల్పులు జరపాల్సి వచ్చిందని నేపాల్ పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేశ్ చంద్ర తెలిపారు. ఉదయం 8.40 గంటలకు ఈ ఘటన జరిగిందని, వెంటనే తమ కమాండర్లు నేపాల్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మృతుడు వికేష్ కుమార్ తండ్రి మాట్లాడుతూ.. నేపాల్లోని నారాయణ్పుర్లో అతడి పంటపొలాలు ఉన్నాయని, అక్కడే తన కుమారుడు పనిచేస్తున్నట్లు వెల్లడించాడు.





