News

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను విడిచి వెళ్ళాల్సిందే – పాక్ కు స్పష్టం చేసిన భారత ప్రభుత్వం

1.9kviews

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ‘గిల్గిట్‌ బాల్టిస్థాన్‌’ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ రాయబారికి దౌత్యపరమైన లేఖ(డిమార్ష్‌)ను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని ఈ సందర్భంగా పాక్‌కు స్పష్టం చేసింది.

గిల్గిట్‌ బాల్టిస్థాన్‌లో వచ్చే సెప్టెంబరులో సాధారణ ఎన్నికలు నిర్వహించుకునేందుకు పాక్‌ కోర్టు గతవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు 2018 నాటి ఆదేశాల్లో సవరణలకు మార్గం సుగమం చేసింది. అలాగే అక్కడ ప్రస్తుతానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో స్పందించిన భారత విదేశాంగ శాఖ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎలాంటి మార్పులను భారత్‌ సహించబోదని తేల్చి చెప్పింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌తో పాటు గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతాలు చట్టబద్ధంగా పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని గుర్తుచేసింది.

పాకిస్థాన్‌ ప్రభుత్వానికి గానీ, అక్కడి న్యాయవ్యవస్థకు గానీ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం లేవని భారత్‌ తేల్చి చెప్పింది. ఈ ప్రాంతంలో భౌతిక మార్పులకు తరచూ యత్నిస్తున్న పాక్‌ చర్యలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రాంతంపై భారత ప్రభుత్వ వైఖరి 1994లో పార్లమెంటు చేసిన తీర్మానం ద్వారా తెలియజేశామని గుర్తుచేసింది. ఆక్రమిత కశ్మీర్‌ను అక్రమంగా ఆక్రమించుకున్న విషయాన్ని, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను, ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న విషయాల్ని పాక్‌ ప్రభుత్వం తాజా చర్యలతో కప్పిపుచ్చలేదని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.