
వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఛార్జీలను వసూలు చేస్తున్నారని వస్తోన్న కథనాలపై భారతీయ రైల్వే స్పందించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్లలో ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. వీరికోసం ప్రత్యేకంగా నడుపుతున్న శ్రామిక్ రైళ్లకోసం కేవలం ఆయా రాష్ట్రప్రభుత్వాల నుంచి మాత్రమే రుసుము వసూలు చేస్తున్నామని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన ప్రయాణికులను మాత్రమే ఈ రైళ్లలో అనుమతి ఇస్తున్నామని..ఇతర వ్యక్తులకు ఇందులో అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వీటిలో ప్రయాణించే వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది. లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు భారతీయ రైల్వే 34 శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల ప్రయాణ ఛార్జీలను భరిస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ప్రకటించారు. వలస కార్మికుల నుంచి రైల్వేశాఖ ప్రయాణ ఛార్జీలను వసూలు చేస్తుందని పలువులు ఆరోపించిన నేపథ్యంలో రైల్వేశాఖ ఈ విధంగా స్పందించింది.





