ArticlesNews

రాజకీయాలకు ‘మాస్క్’ వేసిన కరోనా

969views

సాధారణంగా మన దేశంలో చోటుచేసుకునే ప్రతి పరిణామం వెనుక రాజకీయ కోణాలు ఉండడాన్ని చూసాం. ఒకరు అవునంటే ఒకరు కాదు అనే విభిన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. దేశ ఆర్థిక, సామజిక రంగాలతో పాటు చివరకు దేశ భద్రత, రక్షణ రంగం వరకు కూడా రాజకీయ వాద ప్రతివాదాలు ఉంటూనే ఉంటాయి. ఇది సర్వ సాధారణ విషయం.

దీనికి అతీతంగా గడచిన నెల రోజుల్లో ఒక వాతావరణాన్ని చూస్తున్నాం. నిత్యం రాజకీయ విమర్శలను విని విసిగి వేసాడిన ప్రజలు ఒక వింత అనుభవాన్ని చూస్తున్నారు.

కరోనా వ్యాధి దేశంలోకి ప్రవేశించి నలు  దిశలా వ్యాపిస్తున్న వైనం యావత్ దేశ ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామాలను పసిగట్టిన మోడీ ప్రభుత్వం సరిగ్గా నెల రోజుల క్రితం జనతా ఎమర్జెన్సీ, ఆ మరుసటి రోజున లాక్ డౌన్ ప్రకటించడం ఒక పెను  సంచలనం అయింది. ఆపత్కాలం, పైగా ప్రపంచ దేశాలను వణికించిన ఈ విపత్తు భారత దేశానికి పెను సవాలు. ఈ అవశాన దిశ నుండి బయటపడడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ పార్టీ నైతిక మద్దతు తెలియజేయడం ద్వారా ఇక్కడి ప్రజాస్వామ్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది భారత్.

కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటిస్తే దానిలో రాజకీయ కోణాన్నితెరిచి విపక్షాలు ఎండగట్టడం, దానిపై అధికార పక్షం ప్రతిస్పందించడం, అవసరమైతే ఆ నాయకులూ ఎదురు దాడికి దిగడం మన దేశంలో ఒక సాధారణ పరిణామం. అయితే ప్రస్తుతం వీటన్నిటికీ  అతీతంగా అన్ని పక్షాలు స్పందిస్తున్న తీరు సకారాత్మక దృష్టి కోణాన్ని ఆవిష్కరించింది.

జాతీయ భావానికి ప్రేరణ:

కరోనా వైరస్ ఒక మహమ్మారి. అంటే వైద్య రంగమే కాదు, సామజిక పరిస్థితుల దృష్ట్యా కూడా అన్ని దశలను దాటుకుని కీడు కలిగించడంలో తార స్థాయికి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నైతిక స్థైర్యాన్ని కోల్పోవడం చాలా దేశాల్లో చూసాం. తట్టుకునే శక్తి కొరవడడంతో వేలాది మంది కొన్ని దేశాల్లో పిట్టల్లా రాలి పోయారు. ఇది కేవలం వైద్య పరమైన సమస్య మాత్రమే కాదు దానిని ఎదుర్కోడానికి కావలసిన స్థైర్యాన్ని కూడా కోల్పోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఆయా దేశాల్లో దాపురించింది. అటువంటి పరిస్థితులు దేశంలో తలెత్త కూడదనే ఆలోచనతో జాతినేవత్తు ప్రేరణ కలిగించే ఉమ్మడి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం ఒక గొప్ప పరిణామం.

మహమ్మారి నుండి ప్రజలను కాపాడడానికి అహరహము కృషి చేస్తున్న వైద్య బృందాలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రక్షణ చర్యలను అమలు చేసే పోలీస్, రక్షక బృందాలను వెన్ను తట్టి మీ వెనుక మేమున్నామని నైతిక స్థైర్యాన్ని నింపేలా కోట్లాది ప్రజలను భాగస్వామ్యం చేసేలా నిర్వహించిన కార్యక్రమం ఎంత సంస్కారవంతమైనది అని ప్రపంచమంతా పొగిడిన ఘటన చూసాం. కమ్ముకున్న చీకట్ల నుండి ఆశా దీపాన్ని ఆవిష్కరించే అద్భుత సామజిక చైతన్య కార్యక్రమంలో వంద కోట్ల మందికి పైగా భారతీయులను పాల్గొనేలా చేసి ఒక కొత్త ఆశను ప్రపంచానికి పరిచయం చేసింది భారత్. ప్రపంచ చరిత్రలోనే ఇప్పటి వరకు జరగని పరిణామాలు ఇవి.

దేశాన్ని కుదిపేస్తున్న ఒక ప్రాణాంతకాన్ని ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా లాక్ డౌన్ ప్రకటించడం, సామాజిక దూరం, పరిశుభ్రతపై మార్గదర్శకాలు జారీ చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి గొంతుతో ఆహ్వానించాయి. అయితే ఈ చర్యలపై అఖిలపక్షంతో చర్చించాలని విపక్షాల నుండి వచ్చిన అభిప్రాయాన్ని కూడా కేంద్రం గౌరవించి ఆ దిశగా సమావేశం ఏర్పాటు చేసిన ఒక మంచి సంప్రదాయాన్ని చూసాం. కరోనాపై రాజకీయాలకు అతీతంగా పోరాటాన్ని జరుపుతోంది ఇపుడు భారత్. అర కొర  రాజకీయ బేధాభిప్రాయాలు, వాదోపవాదాలు ఉన్నప్పటికీ ఒక సత్సంకల్పంతో కార్యం సిద్ధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో అన్ని రాజకీయ పక్షాలు హుందాగా వ్యవహరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేకుండా అందరిలోనూ ఒకే సంకల్పం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు చురుకుగా సేవ కార్యక్రమాల్లో పాల్గొని దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. దాదాపుగా విమర్శలు, ఆరోపణలు పక్కన పెట్టి ఈ మహత్కార్యంలో పాలుపంచుకొంటున్నాయి. దేశాధినేత ఇచ్చే మార్గదర్శకాలు, సూచనలు పాటించి ఈ మహాయజ్ఞంలో పాల్గొనడమే ఇపుడు అన్ని పార్టీల నాయకులూ, ప్రజల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం.

– గుడ్లవిల్లేటి మురళి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.