
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19)ను జయించటానికి చైనా, అమెరికాలు ఏకం కావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం చైనా అధినేత ”తాము (కరోనా వైరస్ను గురించి) మొత్తం సమాచారాన్ని, అనుభవాలను పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాం” అని ప్రకటించారు. సినో-అమెరికా సంబంధాలు ప్రస్తుతం అతి కీలక మలుపులో ఉన్నాయని జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పరస్పర సహకారం వలన ఇరుదేశాలు లాభపడతాయని ఇక మిగిలిన అవకాశం అదొక్కటే అని కూడా ఆయన వివరించారు.
తొలుత చైనా ఉన్నతాధికారి ఒకరు అసలు కరోనా ఆవిర్భావం అమెరికా సైన్యం చైనాలో అడుగుపెట్టడం వల్లే అని అనుమానం వ్యక్తం చేయటం అనంతరం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్, సెక్రటరీ మైక్ పాంపియోలు కరోనాను పదే పదే ‘చైనా వైరస్’ అంటూ సంబోధించటంతో ఇరుదేశాల మధ్య అగ్గి రాజుకుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 5,40,000కు పైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, 25,000కు చేరువవుతున్న మరణాలతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా బూచిని చూపి ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను తన దారికి తెచ్చుకోవాలని చైనా భావిస్తున్నట్టుగా ఉంది.





