
ప్రజాసమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో రజకార్ల అజెండాను భుజాన ఎత్తుకుంటున్నారని తెలంగాణ భాజపా ఎంపీలు విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడంపై వారు మండిపడ్డారు. దిల్లీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు మీడియాతో మాట్లాడారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై సీఎం కేసీఆర్కు అవగాహన లేక వాటిని వ్యతిరేకిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. సీఏఏతో ఎవరికీ నష్టం ఉండదని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని శాసనసభ ఎలా వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.
సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం దేశద్రోహమేనని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్పై దేశద్రోహం కేసు నమోదు చేయాల్సిన అవసరముందన్నారు. సీఏఏ పౌరసత్వం ఇచ్చేదే తప్ప.. పౌరసత్వం తొలగించేది కాదనే విషయాన్ని సీఎం గ్రహించాలని సూచించారు. బర్త్ సర్టిఫికెట్ లేదంటున్న కేసీఆర్.. ఇన్నాళ్లు ఎన్నికల్లో ఎలా పోటీ చేశారని ప్రశ్నించారు. మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ అరచేతితో సూర్యకాంతిని ఆపలేరని వ్యాఖ్యానించారు. శాసనసభ తీర్మానంతో తెలంగాణ ఏర్పాటు ఆగలేదని గుర్తు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం.. ముస్లింలను మభ్యపెట్టే చర్య తప్ప మరొకటి కాదన్నారు.





