
“నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా హిందూ ధర్మాన్ని విడిచిపెట్టలేను. నా పేరు ఎవరైనా మార్చగలరా? అలాగే ఒక వ్యక్తి తన ధర్మాన్ని విడిచిపెట్టడం కూడా అంత సులభం కాదు” అని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ స్పష్టం చేశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఇటీవల నెలకొన్న మతపరమైన చర్చల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలోని కడసిద్ధేశ్వర మఠంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన శివకుమార్, తాను హిందూ సంప్రదాయాలు, శాస్త్రోక్త విధానాల ప్రకారమే ప్రమాణ స్వీకారం చేశానని పేర్కొన్నారు.
“మొదట భక్తుడిని.. తర్వాత రాజకీయ నాయకుడిని”
కడసిద్ధేశ్వర మఠంతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని శివకుమార్ తెలిపారు. “నేను ఇక్కడికి ముఖ్యమంత్రిగా రాలేదు. రాజకీయ నాయకుడిగా మారకముందు నుంచే ఈ మఠానికి భక్తుడిని. గత 24 ఏళ్లుగా నిరంతరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. పదవులు తర్వాత వస్తాయి, కానీ భక్తి ముందుంటుంది” అని ఆయన అన్నారు.
దేవాలయాలు భక్తులకు, భగవంతునికి మధ్య వారధులుగా నిలిచే పవిత్ర క్షేత్రాలని పేర్కొన్న ఆయన, తన వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు కర్ణాటక ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
“హిందూ శాస్త్రాల ప్రకారమే ప్రమాణం చేశాను”
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించడంపై కూడా శివకుమార్ వివరణ ఇచ్చారు. నామకరణం, ఉపనయనం, వివాహం వంటి శుభకార్యాలకు మతపెద్దల ఆశీర్వాదం తీసుకోవడం భారతీయ సంప్రదాయమని గుర్తుచేశారు.
“రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే బాధ్యతను స్వీకరిస్తున్న సందర్భంలో అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మిక నాయకుల ఆశీర్వాదం కోరడం సహజం. అందుకే వారిని ఆహ్వానించాను. అయితే నా ప్రమాణ స్వీకారం మాత్రం హిందూ గ్రంథాలు, సంప్రదాయాల ప్రకారమే జరిగింది” అని ఆయన స్పష్టం చేశారు.
డి.కె. శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న మతపరమైన చర్చలకు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.



