
దేశంలో అత్యంత సంబరంగా నిర్వహించుకునే రంగుల పండుగ హోలీపై ఈసారి కరోనా ప్రభావం పడనుంది. ఇప్పటికే ప్రధాని మోడీ తాను ఈ ఏడాది హోళీ సంబరాలకు దూరంగా ఉంటానని ప్రకటించగా భారతీయ జనతాపార్టీ కూడా మామూలుగా దేశవ్యాప్తంగా పార్టీ తరపున నిర్వహించే హోలీ సంబరాలను ఈసారి నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇదే విషయమై అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు సూచించినట్లు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు.
ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోలీ సంబరాల్లో పాల్గొననని ప్రకటించిన నేపథ్యంలో మరికొందరు నాయకులు కూడా అదే బాట పడుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్షా కూడా హోలీలో పాల్గొననని తాజాగా ట్విటర్లో పేర్కొన్నారు. ప్రజలు కూడా గుంపులుగా చేరకూడదని, తాము, తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండేట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని దేశ ప్రజలకు ఆయన సూచించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఆగ్రా, రాజస్థాన్, కేరళ, ఢిల్లీ, తెలంగాణలో కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 3వేల మందికి పైగా మరణించగా, 90వేల మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.





