
ఒక్కసారిగా చంపలేదు. నిదానంగా ఆగి ఆగి ఒక్కొక్క పోటూ పొడుస్తూ ఆరు గంటల పాటు నరకం చూపారు. జాలి, దయ, కనికరం అనే మాటలకు అర్థం మరచి అక్షరాలా 400 సార్లు పొడిచి పొడిచి పేగులు బయటకు లాగి ఉసురు తీశారు. ఆపై మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేశారు. ఢిల్లీ డ్రైనేజీలో శవమై తేలిన ఇంటెలిజెన్స్ బ్యూరో యువ అధికారి అంకిత్ శర్మ చివరి క్షణాల్లో అనుభవించిన నరక యాతన వర్ణనాతీతం.
అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు నివేదికలో ఈ విషయాలను పొందుపరిచారు. అతడి శరీరంలో ఒక్క అవయవాన్ని కూడా వదలకుండా అన్ని భాగాల పైనా కత్తితో పొడిచారని అందులో పేర్కొన్నారు. నాలుగు నుంచి ఆరు గంటల పాటు కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ దుర్మార్గాన్ని కొనసాగించి ఉంటారని వివరించారు. తమ జీవితంలో ఇప్పటివరకు ఇంత దారుణమైన పీడ కలలాంటి అవయవ ఛేదాన్ని (మ్యుటిలేషన్) చూడలేదని పేర్కొన్నారు. అంకిత్ శర్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆప్ నేత తాహిర్ హుస్సేన్ పై గురువారం హత్య కేసు నమోదు చేశారు.





