News

ఇంటర్నేషనల్ స్కూల్‌లో బంగ్లాదేశ్ జెండా.. బజరంగ్ దళ్ హెచ్చరిక

60views

ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన జెండాల్లో బంగ్లాదేశ్‌ జెండా కూడా ఉన్నది. ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న హత్యలపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ జెండాపై బజరంగ్ దళ్ తీవ్రంగా హెచ్చరించింది. మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నలసోపారాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ గోడపై పలు దేశాల జెండాలున్నాయి. ఇందులో బంగ్లాదేశ్‌ జెండా కూడా ఉన్నది.

కాగా, భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ దేశంలోని మైనారిటీలైన హిందువుల హత్యలపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నలసోపారాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బంగ్లాదేశ్‌ జెండా కనిపించడంపై బజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జెండాను తొలగించేందుకు పోలీసులతో కలిసి బజరంగ్‌ దళ్‌ సభ్యులు ఆ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లారు.

మరోవైపు ఆ ఇంటర్నేషనల్ స్కూల్‌ తీరుపై బజరంగ్‌ దళ్‌ మండిపడింది. ‘నలసోపారాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బంగ్లాదేశ్ జెండా ఎగురవేశారు. ఇది భారతదేశ నీతి నియమాలకు విరుద్ధం. హిందువులు హింసకు గురవుతున్నప్పుడు, బంగ్లాదేశ్‌లో మన అక్కాచెల్లెళ్లు , కుమార్తెల భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు, ఇలాంటి చర్యలు భారతదేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి’ అని పేర్కొంది.

‘భారత గడ్డపై కేవలం భారతదేశ త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురుతుంది. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై బజరంగ్ దళ్ గట్టిగా స్పందిస్తుంది. ఈ భూమి భారత్ మాతకు చెందినది. ఇక్కడ కేవలం భారతదేశానికి మాత్రమే గౌరవం దక్కుతుంది’ అని సోషల్‌ మీడియా పోస్ట్‌లో వార్నింగ్‌ ఇచ్చింది.