
ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో అపచారంపై ఆలయ ఈవో శీనా నాయక్ స్పందిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కమిటీ ఈవోకు నివేదిక అందజేసింది. అమ్మవారికి అభిషేకం కోసం వినియోగించిన పాలలో పురుగులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ క్రమంలో స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి మెమోలు జారీ అయ్యాయి. ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవుపాలే వినియోగించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ జరిగింది..
దుర్గమ్మ ఆలయంలో ఇటీవల జరిగిన అపచార ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శ్రీచక్ర అర్చనలో అభిషేకానికి వినియోగించిన పాలలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది. పురుగులు గుర్తించిన అర్చకులు.. వెంటనే అర్చనను నిలిపివేశారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. స్థానాచార్యులు శివ ప్రసాదశర్మ నేతృత్వంలో కమిటీ వేశారు. నిజ నిర్ధారణ చేసి.. నివేదిక సమర్పించాలని వైదిక కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీ ఈవోకు నివేదికను సమర్పించింది. ఈ అపచార ఘటనకు సంబంధించి ఆలయ స్టోర్, పూజా విభాగం ఉద్యోగులు, సంబంధిత అర్చకుడికి మెమోలు జారీ చేశారు. అలాగే.. భవిష్యత్తులోనూ ఆలయంలో అన్నిరకాల అభిషేకాలు, పూజలకు ఆవుపాలను మాత్రమే వినియోగించాలని.. మరే ఇతర పాలనూ వాడరాదని ఈవో శీనా నాయక్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.





