న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఉత్కంఠతో చంపేసి మర్చిపోలేని కిక్కిచ్చింది. టీమ్ఇండియా తొలిసారి సూపర్ ఓవర్ మజా అనుభవించింది. అత్యంత నాటకీయత మధ్య ముగిసిన మ్యాచును వీక్షించి అభిమానులు ఆటను ఆస్వాదించారు. కాగా కిక్కిరిసిన మైదానంలో కివీస్కు చెందిన ఓ యువ అభిమాని ‘భారత్ మాతా కీ జై’ అంటు నినాదాలు చేసి ఆశ్చర్యపరిచాడు.
వాస్తవంగా ఈ ఘటన రెండో టీ20లో చోటు చేసుకుంది. మూడో మ్యాచులో సూపర్ ఓవర్ విజయంతో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. మ్యాచ్ జరుగుతుండగా భారత అభిమానులు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడే ఉన్న కివీస్ యువకుడికి ఇవి ఆసక్తికరంగా అనిపించాయి. నేర్పిస్తారా అని అడిగాడు. అతడికి ఒక్కో పదం ఎలా ఉచ్చరించాలో భారతీయులు నేర్పించారు. వెంటనే అతడు ‘భారత్ మాతా కీ జై’ అని అన్నాడు. సోదర స్ఫూర్తి చాటాడు.
న్యూజిలాండ్ క్రీడాకారులు ఆటలను చక్కగా ఆడతారు. నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించరు. ప్రత్యర్థి ఆటగాళ్లతో స్నేహంగా మెలుగుతారు. ఒత్తిడి ఎంత చిత్తు చేస్తున్నా, ఓటమి అంచున నిలిచినా స్లెడ్జింగ్ చేయరు. అందుకే ప్రతి జట్టూ వారిని గౌరవిస్తుంది. విరాట్ సైతం ‘కివీస్పై ప్రతీకారం అనే మాటే ఉండదు. వారిని కేవలం ప్రేమిస్తాం’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతే కాదు అక్కడి అభిమానులు సైతం సౌభ్రాతృత్వం చాటుతారు. పర్యాటకులను గౌరవిస్తారు. జాతి వివక్ష తరహా వ్యాఖ్యలు చేస్తే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.