News

నేవీ కీలక సమాచారం పాక్‌కు లీక్‌.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

161views

ఒక వ్యక్తి షిప్‌యార్డ్‌లో పని చేస్తున్నాడు. భారతీయ నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు లీక్‌ చేశాడు. ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో అతడితోపాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన 29 ఏళ్ల రోహిత్ గతంలో కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పనిచేశాడు. ఆ సమయంలో ఇండియన్‌ నేవీకి చెందిన యుద్ధ నౌకల సంఖ్య, వాటి వివరాలను వాట్పాప్‌ ద్వారా పాకిస్థాన్‌ వ్యక్తికి అందజేసి డబ్బు పొందాడు.

కాగా, కర్ణాటకలోని ఉడిపి జిల్లా మాల్పేలో ఉన్న సబ్‌ కాంట్రాక్ట్‌ సంస్థ షుష్మా మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రోహిత్‌ బదిలీ అయ్యాడు. అక్కడ ఇన్సులేటర్‌గా అతడు పని చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన స్నేహితుడైన 37 ఏళ్ల సాంత్రి ద్వారా కొచ్చిన్ షిప్‌యార్ట్‌కు సంబంధించిన కీలక సమాచారం సేకరించి మరోసారి పాకిస్థాన్‌కు చేరవేశాడు.

మరోవైపు మాల్పేలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ విభాగం దీనిని పసిగట్టింది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రోహిత్, సాంత్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇండియన్‌ నేవీకి సంబంధించిన కీలక సమాచారం లీక్‌లో ఇంకా ఎవరైన వ్యక్తుల ప్రమేయం ఉన్నదా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.