News

“అమ్మాయిలు రాత్రి బయటకు రాకూడదు”.. గ్యాంగ్‌రేప్‌పై మమత

234views

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం వేట కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాత్రి సమయంలో అమ్మాయిలు బయటకు వెళ్లొద్దని అన్నారు. ఈ విషయంలో తన ప్రభుత్వాన్ని లాగడం అన్యాయమని, ఆమె భద్రతను నిర్ధారించడం కాలేజ్ బాధ్యత అని ఆమె అన్నారు. ‘‘ముఖ్యంగా ,రాత్రి పూట ఆడపిల్లను బయటకు అనుమతించకూడదు. వారు తమను తాము రక్షించుకోవాలి’’ అని మమత అన్నారు. ఈ సంఘటన షాకింగ్ ఘటనగా అభివర్ణించారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలేది లేదని చెప్పారు.