News

శ్వాన్‌సింగ్‌ కోసం భారత ఆర్మీ..

195views

సాయం చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా కలగొచ్చు. కానీ, తమ శక్తికి మించిన సాయం చేయడమనేది మామూలు విషయం కాదు. అది అసాధ్యమనే చెప్పాలి. అయితే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. సరిగ్గా ఆ మనసు కలిగినవాడే శ్వాన్‌ సింగ్‌. ఇంతకీ శ్వాస్‌ సింగ్‌ ఏం చేశాడంటే..

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకి​స్తాన్‌ ఎదురుదాడులకు పాల్పడగా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పదేళ్ల శ్వాస్‌ సింగ్‌ మన సైనికులకు బాసటగా నిలిచాడు. వారికి మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు. ఇప్పటికే ఆ బాలుడి సేవలను ప్రశంసించిన సైనికాధికారులు.. తాజాగా అతడి చదువుకయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఇతనికి ఉద్యోగం వచ్చే వరకు మొత్తం తన చదువు ఖర్చునంతా భరించబోతోంది.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో మామ్ డోట్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ శ్వాన్ సింగ్. శ్వాన్ సింగ్ ఇంటికి సరిగ్గా పాతిక కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ ఉంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్.. పంజాబ్‌లోని మామ్ డోట్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న దాడులను మన సైన్యం విజయవంతంగా ఎదుర్కొంది. ఆ నేపధ్యంలో శ్వాన్‌ సింగ్ ఇంటి ప్రాంతంలో కొంతమంది ఇండియన్ ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు. చుట్టూ తుపాకులు, బాంబుల మోతతో అట్టుడికిపోతున్న ఆ ప్రాంతంలో చీమ కూడా బయటకు రాలేనంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి నుండి చల్లని లస్సీ తయారు చేసుకుని అలసిపోతున్న ఆర్మీ అధికారులకు అందించాడు మన శ్వాన్‌ సింగ్‌. అది కూడా ఏమాత్రం బెరుకు, భయం లేకుండా దాదాపు 10 రోజులు అలా ఇస్తూనే ఉన్నాడు. ఇండియన్ ఆర్మీ శ్వాన్‌సింగ్ చేసిన ఈ సాయానికి, తెగువకు ముచ్చటపడి తన చదువును స్పాన్సర్ చేస్తోంది.