
భారత రక్షణరంగ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణిని వరుసగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలో 28, 29 తేదీల్లో నిర్వహించిన టెస్ట్లు విజయవంతమయ్యాయి. ఈ క్షిపణి అత్యధిక, అత్యల్ప రేంజిని అంచనా వేయడానికి యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్ను నిర్వహించారు.
డీఆర్డీవో ప్రకారం రెండు టెస్ట్ల్లో క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. అంతేకాదు.. అన్ని ప్రమాణాలను ప్రళయ్ అందుకొందని అధికారులు వెల్లడించారు. దీంతో ఇది వినియోగానికి సిద్ధంగా ఉందని తేలినట్లైంది.
ప్రళయ్ స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. యుద్ధ రంగాల్లో నేరుగా వినియోగించేందుకు వీలుగా దీనిని తయారుచేశారు. భారత వాయుసేన, సైన్యం అవసరాలకు తగినట్లు దీనిని తీర్చిదిద్దారు. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదు. 350 నుంచి 700 కిలోల వార్హెడ్ను మోసుకెళ్లగలదు. శత్రువుల కమాండ్ సెంటర్లు, లాజిస్టిక్స్ హబ్స్ను ఇది లక్ష్యంగా చేసుకోగలదు. వాహనాలపై ఉంచి దీన్ని ఎక్కడికంటే అక్కడికి తరలించి మోహరించవచ్చు.





