News

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పేరుతో నకిలీ వెబ్ సైట్

274views

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్ వెలుగులోకి వచ్చింది. రాఘవేంద్ర స్వామి భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలచే ప్రయత్నంలో కొందరు వ్యక్తులు భక్తుల నుండి డబ్బులు వసూలు చేసేందుకు నకిలీ ప్రకటనలు చేస్తూ మోసం చేస్తున్నారు. బెంగళూరు జాతీయ రహదారి పక్కన రాంనగర్ వద్ద 253 అడుగుల శ్రీ రాఘవేంద్ర స్వామి విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ, అలాగే శ్రీ మఠానికి హెలికాప్టర్ కొనుగోలు చేస్తామని నకిలీ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనలలో భక్తులు 9611909961 నంబరుకు ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించాలని సూచించారు.

ఈ నకిలీ ప్రచారానికి ఒక భక్తుడు ఇప్పటికే రూ.1,15,000 ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు సమాచారం. దీనిపై మఠం నిర్వాహకులు అప్రమత్తమై, సురేష్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పందించిన మఠం మేనేజర్ ఎస్.కె. శ్రీనివాసరావు, సురేష్ అనే వ్యక్తికి మఠానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మఠం తరఫున సురేష్‌పై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. భక్తులు ఎవరూ ఈ రకమైన నకిలీ ప్రకటనలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఏ సమాచారం లేదా విరాళాల విషయంలోనైనా మఠం అధికారిక వేదికలతో మాత్రమే సంప్రదించాలన్న విజ్ఞప్తి చేశారు.