
( మే 7 1924 – అల్లూరి సీతారామరాజు వర్ధంతి )
తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీరకిశోరం మన అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని సాయుధ పోరాటం వైపు నడిపిన యోధుడు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాగిన సమరంలో ప్రాణత్యాగం చేసిన అసమాన శూరుడు. అల్లూరి సీతారామరాజు చరిత్ర ఒక తెలుగుగాధ. ఆ వీరుడి పోరును గేయాలు, గీతాలు, పద్యాలుగా, బుర్ర కథలుగా, నాటకాలుగా ప్రచారంలోకి వచ్చాయి. తెలుగు యువతలో ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపాయి. వారిలో త్యాగ నిరతి, దేశభక్తిని పెంపొందింపజేశాయి.
అల్లూరి సీతారామరాజు అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు. చరిత్ర పురుషుడైన సీతారామరాజు 1897 జులై 4న విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ ఇంట జన్మించారు. తల్లి పేరు సూర్యనారాయణమ్మ, తండ్రి పేరు వెంకటరామరాజు. ఈయనకు రాజమండ్రి డీలక్స్ సెంటర్లో ఫోటోస్టూడియో ఉండేది. రాజమండ్రిలో వందేమాతర ఉద్యమ తీవ్రతను తన ఫోటోలతో బంధించిన తండ్రి వెంకటరామరాజు ప్రభావం తనయుడు సీతారామరాజు పై పడింది. దేశభక్తి భావం పెంపొందింది. రాజమండ్రి పరిసరంలోని ఉల్లితోట, టీ.నగర్ ప్రాంతాల్లో అల్లూరి కుటుంబం ఉండేది. తండ్రి కొడుకులిద్దరు గోదావరి ఒడ్డున తిరిగే వారు. ఆ సమయంలోనే శ్రీరామరాజుకు జాతీయ ఉద్యమం, స్వాతంత్ర్య కాంక్ష మొగ్గ తొడిగింది.
శ్రీరామరాజు తన 16వ ఏటన దేశ పర్యటన చేపట్టారు. కాశీలో సంస్కృత భాషను అధ్యయనం చేశారు. బదరీనాథ్, గయ, హరిద్వార్ దర్శించి బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయుర్వేదము, విలువిద్య, గుర్రపుస్వారీ, యోగా, తుపాకీ గురి చూసి కాల్చడం, సంస్కృతము, హిందీ నేర్చుకున్నారు. అలాగే, అనేక ఆయుధాలను ఉపయోగించడంలో మెలకువలను సైతం నేర్చుకున్నారు. దేశాటన అనంతరం శ్రీరామరాజు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కృష్ణదేవిపేటకు 1917లో చేరుకున్నారు. కృష్ణదేవిపేటలోని కాళికాలయంలో తన సన్యాస సాధన కొనసాగిస్తూనే స్థానిక వనవాసీల సమస్యలపై దృష్టి పెట్టారు. ఏజెన్సీ ప్రాంతంలోని వనవాసీలు ఆంగ్లేయుల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది. ఇదంతా గమనించిన శ్రీరామరాజు దేశానికి స్వాతంత్ర్యం రాకముందే మన్యం ఏజెన్సీని స్వతంత్ర్యం చేయాలని తలపోశాడు.
శ్రీరామరాజు వనవాసీలను సంఘటిత పరచి వారికి విలు విద్య ఇతర యుద్ధ విద్యలలో ఆరితేరేటట్లు చేశాడు. త్రాగుడు, వ్యభిచారం, జూదం, వెట్టిచాకిరి మొదలగు దురలవాట్లు, దురాచారాల నుంచి విముక్తి కల్పిస్తూనే వారిని వీరులుగా తీర్చిదిద్దాడు. బ్రిటిషర్లను ఎదుర్కోవాలంటే సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన శ్రీరామరాజు తన సైన్యంతో కలిసి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాల సేకరణ ప్రారంభించాడు. 1922 ఆగస్టు22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై రామరాజు సేన తొలిసారి దాడి చేసింది. 23వ తేదీన క్రిష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. వరుస దాడులతో బెంబేలెత్తిన బ్రిటిష్ అధికారులు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున సేనలను మోహరించింది. అయినా సీతారామరాజు సేన భయపడలేదు. పోలీస్ స్టేషన్ల పై దాడులను కొనసాగించింది. 1922 నుంచి 1924 వరకు శ్రీరామరాజు నేతృత్వంలోని వనవాసీ ఉద్యమం బ్రిటిషర్ల గుండెల్లో అలజడి రేపింది.
అల్లూరి మార్గదర్శకత్వంలో మన్యం వనవాసీలు సమాంతర స్వయంపాలన సాగించారు. పోలీస్ స్టేషన్ల పై దాడులు చేశారు. తాము దాడి చేయబోయే పోలీస్ స్టేషన్లకు ముందుగా సమాచారం పంపించడం, పట్టపగలే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సీతారామరాజు పోరాట ధీరత్వానికి నిదర్శనం. అల్లూరి సీతారామరాజు దళం-బ్రిటిష్ సేనానులకు మధ్య 1924 మే 1 నుంచి 6 వరకు తుది పోరు సాగింది. ఈ పోరులో సీతారామరాజుకు అండగా ఉండే అగ్గిదొర బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డాడు. అప్పటికే, సీతారామరాజు ఆచూకీ తెలపాలంటూ వనవాసీలను బ్రిటిష్ సేనలు చిత్రహింసలకు గురి చేయడం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడాన్ని భరించలేని సీతారామరాజు తన సమాచారాన్ని బ్రిటిషర్లకు తెలియజేశాడు. అలా మంపా నదిలో స్నానమాచరిస్తున్న శ్రీరామరాజును బ్రిటిష్ సేన 1924 మే 7న చుట్టుముట్టి బంధించింది. మేజర్ గుడాల్ బందీగా ఉన్న అల్లూరిని ఓ చెట్టుకు కట్టేసి కాల్చి చంపాడు. ఆయన పార్థివ దేహాన్ని తాండవ నది ఒడ్డున దహనం చేశారు. అలా ఓ స్వరాజ్య భానుడు అస్తమించాడు. సీతారామరాజు భౌతికంగా జీవించింది 27 సంవత్సరాలే అయినా భారతీయుల గుండెల్లో ఆయన ఎప్పటికీ సజీవులే.