News

హింసాకాండతో పారిపోయిన కుటుంబాలు వెనక్కి

285views

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ లోని ముర్షీదాబాద్‌లో చెలరేగిన హింసాకాండతో ఇళ్లు విడిచి పారిపోయిన బాధిత కుటుంబాలు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నాయి. ధులియాన్ నుంచి మాల్డాలోని సహాయక శిబిరానికి తరలిపోయిన పలు కుటుంబాలను భారీ భద్రత మధ్య వెనక్కి తీసుకువస్తున్నారు. భాగీరథీ నది మీదుగా పడవల్లో ప్రజలను వెనక్కి తీసుకువస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

దీనిపై జాంగిపూర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ ఆనంద రాయ్ మాట్లాడుతూ, భయంతో మాల్డాకు పారిపోయిన 50 మందితో పాటు, తక్కిన వారిని కూడా వెనక్కి తెస్తున్నామని, వారిని రిసీవ్ చేసుకునేందుకు తామంతా ఇక్కడున్నామని చెప్పారు. ప్రస్తుతం పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పారు. ముర్షీదాబాద్ హింసాకాండతో ప్రమేయమున్న 292 మందిని ఇంతవరకూ అరెస్టు చేశామని,153 కేసులు నమోదు చేశామని చెప్పారు.

కాగా, స్వస్థలాకు తిరిగి వస్తున్న బాధితులకు టీఎంసీ ఎంపీ ఖలిలూర్ రెహ్మాన్, టీఎంసీ ఎమ్మెల్యే అమీరుల్ ఇస్లాం స్వాగతం పలికారు. వలస వెళ్లిన మిత్రులు ఐచ్ఛికంగా తిరిగి ఇళ్లకు వస్తుండటం చాలా సంతోషంగా ఉందని రెహ్మాన్ చెప్పారు. ధులియాన్‌లో ప్రశాంత పరిస్థితి ఉందని, అందరూ కోరుకుంటున్నది కూడా అదేనని అన్నారు.