News

సంస్కృతిని రక్షిస్తేనే హిందూ ధర్మం నిలబడుతుంది :హంపీ పీఠాధిపతులు

91views

సంస్కృతిని సేవించాలని, రక్షించాలని హంపీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీ వారు పిలుపునిచ్చారు. మనం చేసే సేవలు కచ్చితంగా శ్రీరామునికే చేరతాయన్నారు.పవిత్ర త్రివేణీ సంఘమ క్షేత్రం కందకుర్తిలో లోక కల్యాణార్థం శ్రీ విఘ్నేశ్వర, కుమారస్వామి, రుక్మిణీ పాండుంగ కేశవమూర్తి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ మహా స్వామి వారు హాజరై, ఆశీ: పూర్వక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మనం చేసే పూజ ద్వారా మీరు 25% పుణ్యాన్ని పొందుతామని, సంస్కృతి రక్షణ ద్వారా మరో 25 శాతం పుణ్యం, సమాజసేవ ద్వారా మిగిలిన భాగం లభిస్తుందని వివరించారు. మన మన కుటుంబాలను మరియు చుట్టుపక్కలవారిని సేవించటం ద్వారా ఆశీర్వాదాలు మరియు సానుకూల కర్మను పొందుతారని అన్నారు. సంస్కృతిని రక్షిస్తేనే హిందూ ధర్మం నిలబడుతుందన్నారు. కందకుర్తిలో ఈ ఆలయాల నిర్మాణం జరగడం ఎంతో ముదావహం అని అన్నారు. మరోవైపు ఇదే రోజు త్రివేణీ సంగమం ఒడ్డున పుణ్యశ్లోకీ అహిల్యాబాయి హోల్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన సార్వజనిక సభలో విద్యారణ్య భారతీ స్వామి వారితో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహ తిప్పేస్వామి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సురేందర్ రెడ్డి, సామాజిక కార్యకర్త వి.ఆర్. మోహన్ రెడ్డి, సంఘ ప్రచారకులు, సంఘ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జ్యేష్ఠ ప్రచారకులతో పాటు డాక్టర్ హెడ్గేవార్ వంశస్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు సంస్కృతిపై, భక్తిపై, సేవా తత్పరతపై ప్రసంగించారు. అలాగే ఈ ఆలయాల నిర్మాణం, ధార్మిక పునరుజ్జీవనంపై కూడా విశేషంగా మాట్లాడారు. ఇక దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహ తిప్పేస్వామి గ్రామీణ స్థాయిలో సంస్కృతి పునరుజ్జీవనంపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.

ఇక.. ఈ కార్యక్రమాలు ఈ నెల 16 నుంచి 18 వరకు సాగాయి. 16 న కందకుర్తి గ్రామ వీధులలో విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. అలాగే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు జరిగాయి. 17 వ తేదీన గోపూజతో ప్రారంభమైంది. నవగ్రహ మండల పూజ, సర్వతోభద్ర మండల పూజ, వాస్తు మండల పూజ, స్థాప్య దేవతా మూలమంత్ర హవనం, ధాన్యాధివాసంతో పాటు పలు కార్యక్రమాలు జరిగాయి. ఇక.. చివరి రోజైన 18 వ తేదీన యంత్ర ప్రతిష్ఠ, అవభృత స్నానాలు, శిఖర యంత్ర ప్రతిష్ఠతో పాటు సార్వత్రిక సభతో ఈ కార్యక్రమం ముగిసింది.

డాక్టర్జీ ఆరెస్సెస్ ను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఒకప్పుడు డాక్టర్జీ పూర్వీకులు నివసించిన గ్రామం కందకుర్తి. సంఘశతాబ్ది సందర్భంగా ఈ క్షేత్రంలో పూజ్య డాక్టర్జీ ‘‘స్ఫూర్తి కేంద్రం’’భవ్యంగా నిర్మితమవుతోంది. ప్రేరణాదాయకమైన వారి జీవిత్ర చరిత్ర ఇందులో నిక్షిప్తం చేయనున్నారు. ఇది భావి తరాలకు గొప్ప స్ఫూర్తి కేంద్రంగా మారనుంది.సమాజంలో ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం జరగడానికికూడా దోహపడుతుంది.