ArticlesNews

ధాత్రి.. చైతన్యగాత్రి భాగ్యదాత భూమాత

75views

( ఏప్రిల్‌ 22 – ధరిత్రీ దినోత్సవం )

పంచభూతాల్లో భూమిది మొదటి స్థానం. భువిని ‘భూదేవి’ అంటూ పూజిస్తాం. సకల సంపదలకూ నెలవైన ధరణి వసుంధర పేరుతో ప్రసిద్ధం. సీతాదేవిని లోకానికి అందించిన పరమపావని భూదేవత. శ్రీమహావిష్ణువు పలు అవతారాల్లో భూదేవి ప్రధాన పాత్ర పోషించింది. ధరిత్రిని దానవుల నుంచి రక్షించేందుకు ఆ దేవదేవుడు వివిధ రూపాలు దాల్చాడు.

శ్రీమహావిష్ణువు అంశతో జన్మించిన మహారాజు పృథువు. ఓ రోజు ఆయనకు ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. భూమి సారహీనమైందని, పంటలు లేక అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అది విన్న పృథువు పరిస్థితిని ఆరా తీశాడు. పుడమి గోరూపం ధరించి మహారాజు ముందుకు రాగా.. ‘అమ్మా, భూమాతా! యజ్ఞాల్లో సమర్పించే నెయ్యి మొదలైనవాటిని అందుకుంటున్నావు కానీ ప్రతిఫలంగా ధాన్యం సమృద్ధిగా ఇవ్వటం లేదు. నియమాన్ని అతిక్రమిస్తున్నావు. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. బ్రహ్మదేవుడు నీకు ప్రసాదించిన ఔషధ బీజాలను వెలుపలకు రానివ్వక, నీలోనే నిక్షిప్తం చేసుకుంటున్నావు’ అన్నాడు కోపంగా. అప్పుడు ధరణి ‘రాజా! ప్రాణికోటికి ఆధారంగా ఉండమని నన్ను సృష్టించావు. అందుకే సకలజీవుల్నీ సహనంతో భరిస్తున్నాను. కానీ కొందరు ఔషధమొక్కల్ని సైతం అపహరిస్తున్నారు. నన్ను దుర్వినియోగపరుస్తూ నాలోని సారమంతా తోడేస్తున్నారు. నేను నిర్జీవమయ్యాను’ అని వేదన వ్యక్తం చేసింది. పృథువు సానుకూలంగా స్పందించి, ఆమెని పుత్రికగా స్వీకరించాడు. అలా భూమికి పృథివి అనే పేరు వచ్చింది. భూ సౌభాగ్యం కోసం రాజు యజ్ఞయాగాలు నిర్వహించాడు. భాగవతంలోని ఈ ఘట్టం మనకో పాఠాన్ని నేర్పుతుంది. సమస్త జీవజాల మనుగడకు ఆధారమైన పృథ్విని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.

మన ధర్మగ్రంథాలు భూమిని తల్లిగా, ఆకాశాన్ని తండ్రిగా అభివర్ణించాయి. మనల్ని అమ్మలా ఆదరించి, పోషించేది భూమాతే! ఆకాశం నుంచి కురిసే వర్షాన్ని, నక్షత్రాల కాంతిని, సూర్యభగవానుడి ప్రాణశక్తిని నేలతల్లి గ్రహిస్తుంది. వాటితో తన బిడ్డలైన సకలజీవాల్నీ పోషిస్తుంది.భాగవతాది పురాణాల్లోనే కాదు భారతంలోనూ భూమాత ప్రస్తావన వస్తుంది. భూదేవిని విష్ణుపత్నిగా కూడా ఆరాధించటం భారతీయ సంప్రదాయం. అందుకే మన మహర్షులు పుడమిని పరమ పవిత్రంగా భావిస్తూ ‘అమ్మా! విశ్వవ్యాపకుడైన భగవంతుడి శక్తివి నువ్వు! సముద్రాన్నే వస్త్రంగా ధరిస్తావు. నా పాదాల తాకిడిని క్షమించు తల్లీ!’ అని అడుగు వేస్తూ అభివందనం చేసే ఆచారం మనది. నేలతల్లితో ఇంత ఆత్మీయతనీ, అనుబంధాన్ని అభివృద్ధి చేసుకున్న గొప్ప నాగరికత మనది.

పంట పండించే ముందు భూమిని పూజించటం మన సంప్రదాయం. నేల పచ్చదనంలో భగవంతుడి కరుణను దర్శించగలగటం అత్యున్నత సంస్కారం. ‘భూమి నా తల్లి, నేను పుడమితల్లి బిడ్డని! వర్షాధిపతి అయిన ఇంద్రుడు తండ్రి. వీరిద్దరూ మాకు సంవృద్ధిని కలిగింతురు గాక!’ అని అధర్వవేదం ‘భూమి సూక్తం’ ప్రస్తుతించింది. ఆధునిక కవులు కూడా అవనిని కవితలతో కీర్తించారు. ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి..’ అని కృష్ణశాస్త్రి కీర్తిస్తే ‘ధాత్రి.. చైతన్యగాత్రి’ అని సినారె వర్ణించారు.


పృథివి.. పంచాగ్ని తపస్సు

పారమార్థిక సాధనలో ‘పంచాగ్ని తపస్సు’కు ప్రత్యేకస్థానముంది. గ్రీష్మంలో మిట్టమధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతుంటే నాలుగు దిక్కుల్లో అగ్నుల్ని రగిలించుకొని చేసే తపస్సే పంచాగ్ని తపస్సు. ఎందరో సాధకులు ఈ రకం తపస్సుతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించారు. అయితే నేడు పరమార్థం విషయమేమో గానీ.. మనం అప్రయత్నంగానే ఆ దీక్షలో ఉన్నామనిపిస్తోంది. ఉర్వి ఉష్ణోగ్రతలు పెరిగి, అన్ని వైపుల నుంచి సెగలు కక్కుతుంటే మన పరిస్థితి పంచాగ్ని తపస్సు అయింది. అందువల్ల పుడమిని కేవలం పూజించినంతలో సరిపోదు. భూమి సమ ఉష్ణస్థితిలో ఉండేందుకు కృషి చేయటం మన కర్తవ్యం. నేలతల్లి కలుషితం కాకుండా పరిరక్షించుకోవటమే అసలైన భూమిపూజ!

భూమి.. భగవానుడు!
భగవంతుడు భువి రూపంలో ఉండి జీవజాలాన్ని సంరక్షిస్తున్నాడు. ఆ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో ‘నేను భూమిలో ప్రవేశించి సమస్త జీవజాలాన్ని నా దివ్యశక్తితో భరిస్తున్నాను’ అని స్పష్టం చేశాడు. ఆ భావాన్నే అన్నమయ్య ‘..అని ఆనతిచ్చె కృష్ణుడు అర్జునునితో..’, ‘భూమిలోను జొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల..’ అంటూ ఆలపించాడు. ఆండాళ్‌ అమ్మవారు భూదేవి స్వరూపమని భక్తుల విశ్వాసం.

విష్ణుపత్నికి విశేష ఆరాధన..
హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని చాపలా చుట్టి తీసుకెళ్లి సముద్రంలో దాక్కున్నాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు వరాహమూర్తి అవతారమెత్తి ఆ దేవిని రక్షించాడు. అనంతరం భూదేవతకు ఇరవైనాలుగువేల శ్లోకాలతో కూడిన వరాహపురాణాన్ని వినిపించాడు. సృష్టిక్రమం, మానవధర్మాలు, విష్ణుమూర్తి ఉపాసన విధానం, శివపార్వతుల వృత్తాంతం, ధర్మశాస్త్రాలు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణ ప్రత్యేకత. ఈ ఘట్టాన్నే గుర్తుచేస్తూ భద్రాచల రామదాసు దాశరథి శతకంలో.. ‘నువ్వు వరాహ అవతారం దాల్చి.. భూమిని ఉద్ధరించావు. అలా నన్ను కూడా రక్షించు’ అని వేడుకున్నాడు.