
వక్ఫ్ సవరణల చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ప్రారంభించారు. సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయలేదని, గుర్తించిన వక్ఫ్ ఆస్తుల్లో మార్పులు చేయవద్దని మాత్రమే సూచించిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వానికి వక్ఫ్ ధార్మిక వ్యవస్థతో సంబంధం లేదనీ, ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు విషయంలో తల దూర్చడం లేదనీ పురందేశ్వరి స్పష్టం చేసారు. వక్ఫ్ బోర్డు విషయంలో పేద ముస్లిములకు మేలు కలిగేలా సవరణలు చేసారని చెప్పారు. కానీ ఆ అంశం గురించి ప్రతిపక్షాలు అనవసరంగా తప్పుడు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయలేదని పురందేశ్వరి వివరించారు.
వక్ఫ్ సంస్కరణలపై ప్రజా అవగాహన అభియాన్ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ పాల్గొన్నారు. వక్ఫ్ చట్టం పూర్వాపరాలు, వక్ఫ్ చట్టం వల్ల పేద ముస్లిములకు ఏ మేలూ జరగని తీరు, వక్ఫ్ సవరణల చట్టంలో కొత్తగా చేసిన సవరణలు వంటి అంశాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి… నేషనల్ హెరాల్డ్ కేసు గురించి పాత్రికేయుల ప్రశ్నలకు జవాబిచ్చారు. ఆ కేసులో బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయమూ లేదని చెప్పుకొచ్చారు. ఆ కేసులో బీజేపీ ప్రమేయం లేదని వివరించారు. 2012లో నేషనల్ హెరాల్డ్కు కాంగ్రెస్ పార్టీ పదుల కోట్లలో అప్పులు ఇచ్చి, ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు కొట్టేసారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు.