News

ఏప్రిల్‌ 30న చందనోత్సవం

328views

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్‌ 30న జరగనుందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ఆదేశించారు. పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ, ఇతర అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ…

  • ‘‘స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలి. ఆరోజు తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్యలో అనువంశిక ధర్మకర్త, తి.తి.దే. నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చే వారికి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు అంతరాలయ దర్శనాలు కల్పించాలి. 29వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిచిపోతాయన్న విషయాన్ని భక్తులకు ముందస్తుగానే తెలియజేయాలి.
  • రూ.1500, రూ.1000, రూ.300 టికెట్ల విక్రయాలకు నగర పరిధిలో అనుకూల ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
  • రూ.1500 టికెట్‌ కొనుగోలు చేసే వారికి మాత్రమే నీలాద్రిగుమ్మం నుంచి దర్శనానికి అనుమతించాలి.
  • గత అనుభవాల దృష్ట్యా కొండపైకి వాహనాల రాకపోకల్ని గణనీయంగా తగ్గించాలి. హనుమంతువాక వైపు నుంచి పాత గోశాల వరకు, అక్కడ నుంచి అడివివరం వరకు రెండు పార్కింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలి. భక్తులు కొండపైకి వెళ్లేందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేసి, తాగునీరు, మజ్జిగ అందించాలి. వైద్య శిబిరాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర వసతులపై దృష్టి సారించాలి. కొండపై అదనపు పార్కింగ్‌ ప్రదేశం అభివృద్ధికి, శాశ్వత పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు.
  • సమావేశంలో నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ, డీఆర్వో భవానీశంకర్, ఆర్డీఓ సంగీత్‌ మాధుర్, నగర పోలీసు విభాగం అదనపు కమిషనర్లు, ఈఓ సుబ్బారావు, జీవీఎంసీ, విద్యుత్తు, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.