
తిరుమలలో సాధువులు ధర్నాకు దిగారు. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానందస్వామి ఆధ్వర్యంలో పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్, ఆయన అనుచరులు సోమవారం శ్రీవారి ఆలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. ఈ క్రమంలో శ్రీవారి ఆలయం ముందు దాదాపు 20 నిమిషాలపాటు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతోందో తెలియక భక్తులు భయాందోళనకు గురయ్యారు. అలిపిరిలో ముంతాజ్ హోటల్కు కేటాయించిన జీవో నెంబరు 24ను రద్దు చేసి, ఆ స్థలాన్ని భక్తుల సౌకర్యార్థం కేటాయించాలని, తిరుమలలో గోశాల ఏర్పాటు చేసి టీటీడీనే సొంతంగా డెయిరీ నిర్వహించి ఆ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేయాలంటూ వారంతా సోమవారం ఉదయం పాదయాత్రగా అలిపిరికి చేరుకున్నారు.
తిరుమలలో ధర్నాలు, నిరసనలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని ముందస్తుగానే తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, తాము ఆందోళన చేసేందుకు వెళ్లడం లేదని, స్వామిని దర్శించుకుని వినతిపత్రం సమర్పిస్తామని చెప్పడంతో పాదయాత్రకు అనుమతించారు. దీంతో సాధువులు మధ్యాహ్నం నేరుగా అన్నప్రసాద భవనానికి వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి వైకుంఠం క్యూకాంప్లెక్స్కు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పినప్పటికీ, ఆలయం ముందున్న అఖిలాండం మెట్ల వద్దకు చేరుకుని ఒక్కసారిగా అందరు నేలపై బైఠాయించారు.
‘ముఖ్యమంత్రి మాట తప్పారు. జీవో నెంబరు 24ను వెంటనే రద్దు చేయాలి. సీఎం హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి పైకి లేచేదేలేదు. జైశ్రీరాం.. గోవిందా’ అంటూ 20 నిమిషాలు నినాదాలు చేశారు. తిరుమలలో నిరసనలు, ధర్నాలు నిషేధమని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా వ్యాను, బస్సు, కార్లు ఎక్కించి తిరుపతికి తరలించారు. ‘పోలీసుల జులుం నశించాలి’ నినాదాలు, పోలీసుల కేకలతో ఆలయ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. చొక్కాలు పట్టుకుని లాక్కెళ్లడంతో ఏం జరుగుతోందో తెలియక భక్తులు హడలిపోయారు. సాధువులకు, రామచంద్రయాదవ్కు అలిపిరిలోనే నోటీసులు జారీ చేశామని, తిరుమలలో ధర్నాలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని వారికి ముందే చెప్పామని డీఎస్పీ విజయ్శేఖర్ తెలిపారు. అయితే, శ్రీవారిని దర్శించుకుంటామంటూ వచ్చిన సాధువుల బృందం నిబంధనలకు విరుద్ధంగా ఆలయం వద్ద ధర్నాకు దిగిందని చెప్పారు. ఆందోళన విరమించాలని కోరినా వాగ్వాదానికి దిగడంతోనే తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేశామన్నారు.





