News

యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్‌ నిలువురాళ్లు

311views

తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. వీటితోపాటు అశోకుని శాసన నిలయాలు, చౌసట్టీ యోగినీ దేవాలయాల వంటి ఆరు చారిత్రాత్మక కట్టడాలను జాబితాకు భారత్‌ నామినేట్‌ చేసింది. వీటిని మార్చి 7న తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఎక్స్‌లో తెలిపింది.

ఒక ఆస్తిని ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే.. వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. ఈ ఏడాది భారత్‌ చేర్చిన జాబితాలో చత్తీస్‌గఢ్‌లోని కంగెర్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్, తెలంగాణలోని ముడుమాల్‌ మెగాలితిక్‌ మెన్హిర్స్, పలు రాష్ట్రాల్లోని అశోకుడి శాసన స్థలాలు, మౌర్య రూట్స్, పలు రాష్ట్రాల్లోని చౌసత్‌ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలోని బుందేలాల రాజభవనాలు, కోటలు ఉన్నాయి. వీటితో భారత్‌ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం 62కు చేరింది.