NewsProgramms

బాలికల సర్వతోముఖాభివృద్ధికి నివేదిత గురుకులం కృషి

187views

బాలికల సర్వతోముఖాభివృద్ధి నివేదిత గురుకులం కృషి చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు అదరణీయ భాగయ్యగారు తెలిపారు. శ్రీ విజ్ఞాన విహార, విజయవాడ ఆధ్వర్యంలో బాలికల కోసం కృష్ణాజిల్లా ఉంగుటూరులో మార్చి 2 వ తేదీన నివేదిత గురుకులం, శ్రీజయరామ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వాహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా వ్యవహరించిన భాగయ్య గారు మాట్లాడుతూ, ఈ గురుకులం గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేలా బాలికలను తయారుచేయాలని కోరుకోవడం లేదు. గొప్ప గొప్ప ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వాళ్ళని తీసుకువెళ్లాలని, స్వావలంబనతో, స్వాభిమానంతో, ప్రస్తుత సమాజంలో సాధికారత కలిగిన యువతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించిందని చెప్పారు. ప్రారంభంలో ఆడపిల్లలను ఎందుకు అంతదూరంలో చేర్చడం అని అన్న వ్యక్తులే ఇప్పుడు తమ పిల్లలను తీసుకు వచ్చి గురుకులంలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.


ప్రస్తుతం 3 రాష్ట్రాలనుండి 35 మంది చదువుతున్నారని, 2025 – 26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఒకటి పూర్తయ్యిందన్నారు. మార్చ్ 16 న రెండవసారి పరీక్ష ఉంటుందని, ఈ రెండు పరీక్షల తర్వాత తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసి పిల్లలకు అడ్మిషన్ ఇస్తామన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం పూర్తి అయ్యే నాటికి సుమారు 6 ఎకరాలలో ఈ నివేదితా గురుకులాన్ని విస్తరించనున్నామని భాగయ్యగారు తెలియచేశారు.

వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా శ్రీ విజ్ఞాన విహార, విజయవాడ ప్రెసిడెంట్ శ్రీ బి.వి.ఎస్.టి. సాయి గారు పాల్గొనగా, ముఖ్య అతిథులుగా హైదరాబాద్ విష్ణు కెమికల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చెరుకూరి కృష్ణమూర్తి గారు, శ్రీమతి చెరుకూరి మంజుల గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గౌరవ సభ్యులు శ్రీమతి విజయ భారతి గారు, రామకృష్ణ శారదా మిషన్ పరివ్రాజక భోధనమయ ప్రాణ, రామకృష్ణ శారదా మిషన్ పరివ్రాజక త్యాగనిష్ట ప్రాణ తదితరులు పాల్గొన్నారు.