
భారత దేశ నాగరికతకు మూలం ఆధ్యాత్మికతే అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఈ ఆధ్యాత్మిక చైతన్యమే శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా సాగుతోందన్నారు.ఆచార్య భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి ప్రభుపాద 150 వ జయంతి ఉత్సవాలు కలకత్తాలో జరిగాయి. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ధన్కర్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రేమ, శాంతి, సామరస్యం కోసం సనాతన ధర్మాన్ని గౌడీయ మిషన్ వ్యాప్తి చేసిందన్నారు.
పాశ్చాత్య దేశాల్లో భారతీయ ఆధ్యాత్మిక చింతనను ప్రాచుర్యంలోకి తేవడానికి ప్రభుపాద బాగా కృషి చేశారన్నారు.
సుభాష్ చంద్రబోస్, మదన్ మోహన్ మాలవీయ వంటి గొప్ప గొప్ప నేతలను కూడా ప్రభుపాద ప్రేరేపించారని ధన్కర్ పేర్కొన్నారు. సమాజంలో వున్న కుల వివక్షతతో పాటు అనేక సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూడా పోరాడారన్నారు.
ఆధ్యాత్మిక సాహిత్యాన్ని బాగా వ్యాప్తి చేయడానికి ఆచార్య శ్రీల ప్రింటింగ్ ప్రెస్ ను బాగా వాడారని, అనేక భాషలలో సాహిత్యాన్ని ప్రచురించడం ద్వారా భారతీయ తత్వశాస్త్రం ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిందని ధన్కర్ పేర్కొన్నారు.





