
మహాకుంభమేళా సందర్భంగా అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి భారీగా పెరిగిందని రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలోనే రామాలయ నిర్మాణ పనులు 25 రోజులుగా ఆగిపోయినట్లు ఆయన తెలిపారు. మార్చి నెలలో పూర్తి కావాల్సిన పనులు జూన్ నాటికి అవుతాయని నృపేంద్ర వెల్లడించారు. అయోధ్యలోని రామ జన్మభూమి సముదాయంలో జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులపై నృపేంద్ర మిశ్రా నేతృత్వంలో రెండు రోజులుగా సమావేశాలు జరుగుతున్నాయి.మెుదటి రోజు జరిగిన సమావేశంలో ఆలయానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నృపేంద్ర తెలిపారు. ఆయన నిర్మాణాలు పరిశీలించామని, అలాగే కొన్ని కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
మహాకుంభమేళా సందర్భంగా అయోధ్య బాల రాముడి దర్శనార్థం వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ దర్శన, నిష్క్రమణ ద్వారాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినట్లు నృపేంద్ర తెలిపారు. దీనికి సంబంధించి నిర్మాణ కమిటీలోని ముఖ్య సభ్యులందరూ నేడు ఆలయాన్ని పరిశీలించి చర్యలు చేపడతారని చెప్పారు. అలాగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో భక్తుల బూట్లు, చెప్పులు ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రామ జన్మభూమి సముదాయంలోని 11వ నంబర్ గేట్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అయితే భక్తుల తాకిడి వల్ల గేట్ నంబర్ 3 పనుల పూర్తి ప్రస్తుతం సాధ్యం కాదని చెప్పారు.
అయితే ప్రస్తుతం మహాకుంభమేళాకు భక్తుల తాకిడి కొంతమేర తగ్గినందున ఇప్పటికే సిద్ధం చేసిన తులసీదాస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించినట్లు నృపేంద్ర తెలిపారు. మరోవైపు జూన్ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని, సెప్టెంబర్ నాటికి ప్రాకార నిర్మాణం పూర్తవుతుందని నిపేంద్ర వెల్లడించారు.





