GalleryNews

మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

317views

మహాకుంభమేళాకు 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో నూతన ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 13 రాత్రి 8 గంటల వరకూ కుంభమేళాకు ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. కేవలం కుంభమేళాలో విధులు నిర్వహించే అధికారులు, వైద్య సిబ్బందికి సంబంధించిన వాహనాలను మాత్రమే ‍ప్రయాగ్‌రాజ్‌లోకి అనుమతించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మహాకుంభమేళాపై అధికారులతో సమీక్ష జరిపారు. మాఘపౌర్ణిమ నాడు ట్రాఫిక్‌ నియంత్రణ, క్రౌడ్‌ మేనేజిమెంట్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

సంగమానికి ఎలా వెళ్లాలి?
సంగమం చేరుకోవడానికి నడక మార్గం: భక్తులు జీటీ జవహర్ మార్గ్ నుండి త్రివేణీ సంగమానికి చేరుకోవచ్చు. ఈ నడకమార్గంలో భక్తులు కాళీ రాంప్, సంగమం అప్పర్ రోడ్ ద్వారా త్రివేణీ సంగమానికి రావాల్సివుంటుంది.

తిరుగు నడక మార్గం: సంగమం ప్రాంతం నుండి అక్షయవత్ మార్గ్ మీదుగా తిరుగు మార్గంలో నడచివెళ్లాల్సివుంటుంది.

అధికారులకు సీఎం ఆదిత్యనాథ్‌ సూచనలు
మహా కుంభమేళాకు సంబంధించి అధికారులతో సీఎం యోగి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.

1.మహా కుంభ్ మార్గ్‌లో ట్రాఫిక్ ఎక్కడా ఆగకూడదు. పార్కింగ్ స్థలాలను సక్రమంగా నిర్వహించాలి.

2 ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు అన్ని దిశల నుండి వస్తున్నందున రోడ్లపై వాహనాల క్యూలు ఉండకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి.

3. మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వసంత పంచమి నాడు అమలు చేసిన వ్యవస్థలను తిరిగి అమలు చేయాలి.

4. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పార్కింగ్ ప్రాంతం నుండి జాతర ప్రాంగణానికి షటిల్ బస్సుల సంఖ్యను పెంచాలి.

5. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని కూడా కుంభమేళా జరిగే ప్రాంగణంలోకి అనుమతించకూడదు.

6. ప్రతి భక్తుడిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడమనేది అధికారుల బాధ్యత.

7. మహాకుంభ్ ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. ఉత్సవం జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి.

8 ప్రయాగ్‌రాజ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల అధికారులు ప్రయాగ్‌రాజ్ అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలి. వాహనాల కదలికలను పరస్పర సమన్వయంతో పర్యవేక్షిస్తుండాలి.

9. ప్రయాగ్‌రాజ్‌లోని ఏ రైల్వే స్టేషన్‌లోనూ అధిక జనసమూహం గుమిగూడకుండా చూసుకోవాలి. స్పెషల్ రైళ్లు, అదనపు బస్సులను నడపాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు.